K Kavitha: కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈరోజు విచారణ

  • తనపై అక్రమంగా కేసు పెట్టారంటున్న కవిత
  • లిక్కర్ కేసులో కవితే కింగ్ పిన్ అంటున్న ఈడీ
  • రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అంటూ అభియోగాలు
Court to hear Kavitha bail plea today

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు, తాను నిర్దోషినని, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు కోర్టులో విచారణ జరగనుంది. తనపై అక్రమంగా కేసు పెట్టారని పిటిషన్ లో కవిత పేర్కొన్నారు. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. అప్రూవర్ గా మారిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. 

మరోవైపు కవిత లేవనెత్తుతున్న అంశాలను ఈడీ వ్యతిరేకిస్తోంది. లిక్కర్ కేసులో కవితే కింగ్ పిన్ అని ఈడీ చెపుతోంది. సౌత్ గ్రూప్ కు - ఆప్ కు మధ్య జరిగిన రూ. 100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవితదే కీలక పాత్ర అని కోర్టుకు తెలిపింది. సాక్ష్యాలు లభించకుండా ఫోన్లలో డిలీట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత వాట్సాప్ డేటాను డిలీట్ చేశారని వెల్లడించింది. ఎంతో పలుకుబడి ఉన్న కవితకు బెయిల్ ఇస్తే... బయటకు వెళ్లిన తర్వాత సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టుకు తెలిపింది. 

ఈ నేపథ్యంలో, కవిత బెయిల్ పిటిషన్ పై విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవితకు రెగ్యులర్ బెయిల్ వస్తుందా? లేదా? కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనే విషయం మధ్యాహ్నం కల్లా తేలిపోనుంది.

More Telugu News